మమ్ముట్టిని కలిసిన రేణుదేశాయ్
- మమ్ముట్టిని కలవడం తన లైఫ్ డ్రీమ్ అన్న రేణుదేశాయ్
- తన జీవితంలో ఒక క్రేజీ మూమెంట్ అని వెల్లడి
- మమ్ముట్టి అత్యంత ప్రతిభావంతుడని ప్రశంస
నటి రేణు దేశాయ్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో మళ్లీ బిజీగా మారుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు విడాకులు ఇచ్చిన తర్వాత కొంతకాలం పాటు ఆమె ఇద్దరు పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే, కొన్నేళ్ల క్రితం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్, ప్రస్తుతం ఒకవైపు కమర్షియల్ యాడ్స్, సినిమాలు చేస్తూనే.. మరోవైపు మూగజీవాల సంరక్షణ కోసం ఒక ఎన్జీవోను నడుపుతూ వాటి హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నారు.
తాజాగా రేణు దేశాయ్ మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టిని కలిశారు. ఆ క్షణాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మమ్ముట్టిని కలవడం తన జీవితంలో ఒక క్రేజీ మూమెంట్ అని, ఆయనను కలవడం తన లైఫ్ టైమ్ డ్రీమ్ అని ఆమె పేర్కొన్నారు. ఒక వీరాభిమానిగా మమ్ముట్టి సార్ను కలిసి, ఆయనతో కొంత సమయం గడపడం వల్ల తన హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతోందని రేణు దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. తాను ఇప్పటివరకు కలిసిన వారిలో మమ్ముట్టి అత్యంత ప్రతిభావంతుడు, వినయశీలి, తెలివైనవాడు, దయగల వ్యక్తి అంటూ ఆమె ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం మమ్ముట్టితో ఆమె దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.